Wednesday, February 3, 2010

ఛానళ్ల "క్రియేటివ్" న్యూస్ స్టోరీస్...

నేటి ఎలక్ట్రానిక్ మీడియాపై మనకే నవ్వు వస్తుంది. మరికొందరికి ఎంతగా దిగజారిపోయామో అనిపిస్తుంది. ఇంకా స్వాతంత్ర్యసమరయోధులకైతే.. హతవిధీ... ఎంతగా విలువలు పడిపోయాయో అనిపిస్తుంది. ఇది ఒకరోజు కాదు. రెండు రోజులు కాదు.. ఎన్నో రోజులుగా ప్రజల మనస్సులతో ఆడుకుంటున్న ఛానళ్ల వ్యవస్థకు దర్పణం.

చాలా సినిమాల్లో మీడియాపై రకరకాల సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అవన్నీ హాస్యం కోసమే అన్నట్లు చోద్యం చూస్తూనే ఉన్నారు. కానీ ఛానళ్ల తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది..? దీనికి బాధ్యులెవరు? అనేదానికి ప్రభుత్వ యంత్రాంగమే సమాధానం చెప్పాలి.

దేశంలో ఎక్కడా లేనటువంటి ఛానళ్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా వస్తున్నా వాటికి పర్మిషన్లు ఇచ్చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. పర్మిషన్‌కోసం పైరవీలు... కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులకు వేలాది జీతాలు పెంచేస్తున్నారు. క్రియేటివ్ హెడ్ జీతమైతే లక్ష రూపాయల వరకూ ఉంటుంది. ఆ మధ్య ఓ ఛానల్‌లో అసిస్టెంట్ క్రియేటివ్ హెడ్ పోస్ట్ వేసి దానికి మరో లక్ష అదనంగా ఇవ్వడం ప్రారంభించారు. ఆ క్రియేషన్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది.

ప్రధానంగా సినిమా వార్తలో బాలీవుడ్, టాలీవుడ్ న్యూస్‌తో పాటు గాసిప్స్ కూడా ప్రారంభించారు. అందులో మార్నింగ్ ఫోటోలు పెట్టేసి.. ఫలానా తార ఫలానా వారితో ఇలా తిరిగింది... డాన్స్ చేసింది... అనేది సారాంశం. ఇలా ఒక్కటి కాదు... రోజూ రాత్రిపూట ఒక్కో ఛానల్‌ది ఒక్కో శైలి. ఇలియానా గోవా బీచ్‌కు వెళితే.. అంతకుముందు నటించిన దేవదాసులోని ఎక్స్‌పోజింగ్ సీన్స్ చూపించి ఇంతగా అక్కడి జనాలను ఆహ్లాదపరుస్తోందంటూ... కథనాలు చెప్పడం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని.

అసలు మీడియా అనేది ఎలా ఉండాలి. ఎలాంటివి ప్రసారం చేయాలి..? దానికి పరిమితులు ఏమిటి..? అనేవి తెలీని వారు కూడా జర్నలిజంలో రాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు జర్నలిజం అంటే గౌరవప్రదంగా భావించేవారు. ఫోర్త్ ఎస్టేట్‌గా ప్రభుత్వం ఒక సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. కాలక్రమేణా విలువలు దిగజారుతున్నాయి. ఏది నిజం.. ఏది అసత్యం.. అనేది ఆలోచించకుండా పోటీ తత్త్వంతో ముందుకు సాగుతున్నాయి. వేసిన వార్తనే వేస్తూ.. కాస్త బ్రేక్ ఇస్తూ.. నిరంతరం చూస్తూనే ఉండండి... అంటూ వీక్షకుల మనస్సు మరల్చకుండా చేస్తున్నాయి. దీనికి వీక్షకుడు బానిస అవుతున్నాడు.

ప్రయోజనం లేని వార్త అయినా మనమెందుకు చూడాలి... మన పనులను మానుకుని చూడాలా..? అని ఆలోచించే దశను దాటిపోయారు. ఈ ప్రభావం బంధుమిత్రుల ఆప్యాయత అనురాగాలపై కూడా పడుతోంది. చుట్టం చూపుగా ఎవరైనా వస్తే... టీవీ చూస్తూనే ఉంటారు. ఏదో మిస్సయినట్లుగా దాన్నే చూస్తూ.. ఏదో గుడ్డిగా పలుకరించే దుస్థితికి మానవుడు వచ్చేశాడు.

టీవీ వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఎలాగా...? మంచి విజ్ఞాన కార్యక్రమాలు ప్రదర్శిస్తే.. అవి తగ్గిపోయి అజ్ఞానాన్ని, ఊహాజనితమైన వాటిని ప్రదర్శిస్తూ... కోట్లు గడిస్తున్న ఆయా యాజమాన్యాలు ప్రజలను నిస్సహాయులుగా చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియా రాజ్యమేలుతున్న దశలో స్వాతంత్ర్య పోరాటాలు ఆ మరుసటి నాడే ప్రపంచానికి తెలిసేవి. రేడియోలు ఉండేవి. అవి వినడానికి గ్రంధాలయాలకు వెళ్లి మరీ వినివచ్చేవారు. కాలక్రమేణా మార్పులతో విజ్ఞానం మారి అరచేతిలోకి వచ్చేసింది. దీన్ని వ్యాపారం చేసే యాజమాన్యం రకరకాలుగా ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తోంది.

ఏదైనా ఒక సంఘటన తీసుకుంటే.. తెలంగాణా, సమైక్యాంధ్ర పోరాటాల్లో... చిన్నపాటి సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ... వారికి వారికి మధ్య చర్చపెట్టి చిచ్చు రేపుతున్నాయి. దేనికైనా సమయం రావాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లుంది... వైఎస్ మృతిపై అనుమానం ఉందని ఏదో రష్యా వెబ్‌సైట్ రాస్తే... దాన్ని ప్రధానంగా చూపి రాష్ట్రంలో అలజడులు సృష్టించాయి కొన్ని ఛానళ్లు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేకంటే... ఇలాంటివి ప్రసారం చేసిన ఛానళ్లపై కఠిన వైఖరి ప్రదర్శించాలి.

దేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే... దాన్ని వెలికి తెచ్చి ప్రజలకు చెప్పామని తృప్తిపడి రేటింగ్ పెరిగిందనే సంస్కృతి ఉండేది. కానీ నేడు లేనిది కూడా ఉన్నట్లుగా ఏదో ఒక సంఘటన సృష్టించి దాన్ని వెలుగులోకి తెచ్చామని భుజాలు చరచుకోవడం ఎక్కువైంది. ఆ మధ్య ఓ టీవీ చానల్ ఓ చిత్రమైన షో ఏర్పాటు చేస్తే... అందులో ఒక యువకుడు తన ప్రేయసిని తలచుకుంటూ పాటను పాడాడు. ఆ యువకుడు ఉన్నత కుటుంబంలోని ఓ అమ్మాయిని ప్రేమించి ప్రేమలో విఫలమై ఆ పాటను రాసుకున్నాడని... ఆ పాటను పదే పదే ప్రసారం చేయడం... ఆ తర్వాత దాన్ని చూసిన ఓ నటుడు ఎకాఎకిన రాష్ట్రరాజధానికి వచ్చి సినిమా తీస్తానని ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి చెప్పడం.. చూసి మిగిలిన జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఓ సీరియలే రాయవచ్చు. ఛానళ్లు అనేవి విదేశాలను అనుకరించినవే... విదేశీ ఛానళ్లు ఏం ప్రోగ్రాములు చేస్తే వాటిని కాపీ చేసి మనవాళ్లు క్రియేటివ్ అని పేరు వేసుకుని చేస్తుంటారు. దాన్నే మరో ఛానల్ పేరు మార్చి ఉపయోగించుకుంటుంది. కానీ విదేశాల్లో ఇంతగా దిగజారే విలువలు లేవని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు.

రిలయన్స్ ఘటనతో అంతా ఎలర్ట్ అయ్యారు. వాస్తవాలు ఏమైనా.. ప్రతి పార్టీకి చెందిన నాయకుడు స్పందించాడు. ఛానళ్లకు నియంత్రణ ఉండాలని. మరి వారు ఆర్థికంగా ప్రోత్సహిస్తూ.. ప్రచారానికి ఉపయోగించుకున్నంతవరకూ బాగానే ఉంది వ్యవహారం. అంతా అయిపోయాక, వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేనికైనా టైమ్ రావాలంటారు. ఒక్కోసారి ఒక్కో ఛానల్‌లో ప్రసారాలు చూస్తుంటే.. కామన్ పీపుల్‌కు పిచ్చెక్కిపోతుంది. టీవీని పగులగొట్టాలనిపిస్తుంది.

ఒకప్పుడు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఛానళ్లు నిషేధించారు. ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడకు వచ్చేసి షూట్ చేయడం... దాన్ని టెలికాస్ట్ చేయడంతో సినిమా రిలీజ్ నాటికి కొన్ని సీన్స్ చూశాక... ఇదేదో పాత సినిమా అన్నట్లు ప్రేక్షకులలో భావన రావడం జరిగింది. ఇది ఎప్పుడో చూశాం కదా... అని థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయింది. దాంతో కలెక్షన్లకు గండిపడింది. దీంతో ఛాంబర్ కళ్లు తెరిచి... ఛానళ్లను రానివ్వద్దని హుకుం జారీ చేసింది. అది ఓ వ్యక్తికి సంబంధించిన కాబట్టి కోట్ల వ్యాపారం కనుక దానిని అడిగే హక్కు ఛానల్‌కు లేదు. కానీ రాజకీయం అంటే ప్రతివారికీ లోకువే. ప్రజాస్వామ్యంలో మేం చెప్పే హక్కు ఉందని వితండవాదం చేస్తారు ఛానల్‌వారు.

అంతేకాదు... అసలు ఛానళ్లలో ఉన్న రాజకీయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ మధ్య ఓ ఛానల్ అధిపతి సహఉద్యోగిని మోసం చేశాడు. అది బయటకు రాలేదు. అయినా ఆ అమ్మాయి వదలకపోవడంతో ఆమె శీలం మంచిది కాదనీ, బెదిరించడంతోపాటు మరో స్త్రీతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. ఇది జరిగిన సంఘటనే. ఇదే బయట జరిగితే... 24 గంటలు ప్రసారాలు చేస్తూ ఉతికి ఆరేస్తారు. సదరు వ్యక్తి నీచుడు... ఛండాలుడు అంటూ నానా రభస చేస్తారు. కానీ సదరు ఛానల్ అధిపతిని ఆ అమ్మాయి తాలూకు బంధువు వదల్లేదు. అతడిపై కత్తితో మేకులతో దాడి చేసి కసి తీర్చుకున్నాడు. అది పోలీసు కేసు కావడంతో తప్పనిసరై ప్రసారం అయింది. ఇదే కాదు... ఎన్నో ఘటనలు... కేవలం బ్లాక్ మెయిల్ ఛానల్ అని ఒకదానికి పేరుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఛానళ్ల వికృత పోకడల దృష్ట్యా భవిష్యత్‌లో మీడియాపై విప్లవం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.