Saturday, January 23, 2010

ముగ్గురూ.. ముగ్గురే: ఇక తెలంగాణా ఏఁవత్తది!

నాన్నేమో.. హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు కోస్తాడట. అల్లుడేమో.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని శంషాబాద్ విమానాశ్రయంలో కాలుపెట్టనీయడట. కూతురేమో.. సమైక్యాంధ్ర వాదులు నిర్మించిన చిత్రాలను అడ్డుకుంటారట". గత కొన్ని రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వార్తలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు చేస్తున్న విద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలే వీరి వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల బతుకులు ఏవిధంగా ఉంటాయో సినీ నటి విజయశాంతి నటించిన "ఒసేయ్.. రాములమ్మ" చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు మన దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు. అంతేకాదు.. సాక్షాత్ తెలంగాణ ప్రాంతానికే చెందిన విప్లవ హీరో ఆర్.నారాయణ మూర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించిన పలు చిత్రాల్లో తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులనే కథా నేపథ్యంగా తీసుకుని చూపించారు.అంటే.. తెలంగాణ దొరల చెప్పుచేతల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఏవిధమైన దుర్భర జీవితం గడిపారో ఈ చిత్రాల్లోని సన్నివేశాలే నిదర్శనం. ఇలాంటి ప్రజల బతుకులు బాగు చేసుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది. అయితే, ఆ పార్టీకి చెందిన అధినేతతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు మరో ప్రాంతం వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయి.హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు తెగ్గొస్తాం అని కేసీఆర్ అంటే.. ఆయన మేనల్లుడు హరీష్ రావు ఏకంగా.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని శంషాబాద్ విమానాశ్రయంలో అడుడుపెట్టనీయమని హెచ్చరించారు. ఇకపోతే.. కేసీఆర్ కుమార్తె కవిత మరో అడుగు ముందుకు వేశారు. కళలకు, కళాకారులకు ఎల్లలు లేవన్నది జగమెరిగిన సత్యం. మరి.. అలాంటి కళాకారులు నటించిన చిత్రాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు చేశారు.

అంటే.. వీరి డిమాండ్ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా.. వీరి పాలన ఇలాగే కొనసాగుతుందా? అనే ధర్మసందేహం సామాన్య ప్రజానీకంలో ప్రస్తుతం ఉత్పన్నమైంది. అధికారం లేకపోయినా.. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినొస్తున్నాయి. ఇక.. నిజంగానే అధికార పగ్గాలు చేపడితే వీరి పాలన ఎలా ఉంటుందో వీరు చేస్తున్న వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయని పలువురు తెలంగాణ ప్రాంత వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారివల్లే అనుకున్న లక్ష్యం మధ్యలోనే నీరుగారి పోయే ప్రమాదం ఉందని ఉద్యమకారులను ప్రజలు హెచ్చరిస్తున్నారు.

1 comment: